AP Politics : రాజులు పరిపాలించిన కాలంలో కూడా ఆంక్షలు కఠినంగా లేవని చరిత్ర చెబుతోంది. రాజు వస్తున్నాడంటే జనం రాజును చూడటానికి తండోప, తండాలుగా వీధుల్లోకి వచ్చేవారు. రాజు కూడా తన పర్యటనలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేది. కానీ రాజు వస్తున్నాడంటే ఎవ్వరికి కనబడకుండా పరదాలు, డేరాలు, కట్టిన సందర్భాలు చరిత్రలో లేవు.
కానీ గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజుల పరిపాలన లేదు. రాజకీయ నాయకుల పరిపాలన కొనసాగింది. ఆ రాష్ట్రంలో మనుషులే పరిపాలించారు. పరిపాలనకు ఎన్నుకున్న ఎమ్మెల్యేల ముఖ్య నాయకుడు, అంటే ఆయనే ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయన వస్తున్నాడంటే చాలు అధికారులు ఆఘమేఘాల మీద దుకాణాల వెంట పరుగులు తీయాల్సిందే. పరదాలు కొనుక్కొని తీసుకు రావాల్సిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించే దారి వెంట పరదాలు కట్టాల్సిందే. పరదాలు ఎందుకు కట్టాలంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు కనబడరాదు. ప్రజలు చూద్దామంటే ముఖ్యమంత్రి కనబడరాదు.
ఒక్క పరదాలు కట్టడమే కాదు. చెట్ల కొమ్మలు కిందికి వేలాడి ఉన్నాయంటే వాటిని కొట్టివేయాల్సిందే. దారి వెంట కూడా నచ్చని దృశ్యాలు ఏమైనా ఉంటె, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సీఎం వస్తున్నాడంటే సంబందిత శాఖల అధికారులు చెమటలు కక్కాల్సిందే.
ఇప్పుడు వచ్చిన నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటనకు, మాజీ సీఎం పర్యటనకు చాలా తేడా ఉందని ప్రజల్లో అప్పుడే చర్చ మొదలైనది. ఇటీవల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఆయన పర్యటన సందర్బంగా, గతంలో మాజీ సీఎం మాదిరిగానే పరదాలు కట్టారు రోడ్డు వెంట.
దీన్ని గమనించిన చంద్రబాబు సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు పరదాలు కట్టారు అని అధికారులను ప్రశ్నించారు. జవాబు చెప్పక తప్పలేదు. గతంలో సీఎం వస్తున్నాడంటే ఇదే విదంగా ఏర్పాట్లు చేసేవారమని సెలవిచ్చారు. ఈ విధానం సరికాదని, ఇటువంటి పద్ధతులకు ఇకనుంచి స్వస్తిపలకాలని సుతిమెత్తగా అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరదాల సంప్రదాయానికి తెరపడింది.