RGV Vyuham : శివ, రంగీలా, సత్య, సర్కార్.. వంటి సినిమాలు తీసి టాలీవుడ్, బాలీవుడ్ లను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పొలిటికల్ , ఎక్స్ సినిమాలతోనే సంతృప్తి పడుతున్నారు. జనాలు కూడా ఆయన సినిమాల నుంచి ఏమీ ఆశించడం లేదు. థియేటర్లకు కూడా రావడంలేదు. అయినా వర్మ జనాలను వదలడం లేదు. నెలకో, రెండు నెలలకో సినిమా వదులుతూనే ఉంటాడు. ‘ఏ’ సినిమాల గ్యాప్ లో అప్పుడప్పుడు పొలిటికల్ సినిమాలతో జనాలపై విరుచుకుపడుతుంటాడు. అవి ఒక పార్టీకి అనుకూలంగా.. మరో పార్టీకి వ్యతిరేకంగా తీస్తూ.. ఏదో సెన్సేషన్ చేయాలనుకుంటాడు. కానీ వాటిని జనాలు పట్టించుకోవడం లేదు.
రామ్ గోపాల్ వర్మ తాజాగా రచించిన ‘వ్యూహం’ బెడిసికొట్టింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం సాయంత్రం ‘వ్యూహం’ మూవీ ప్రిరిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని భారీగా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది కూర్చుని తిలకించేందుకు గ్రౌండ్ మొత్తం కుర్చీలను వేశారు. భారీ సెట్టింగులతో హడావిడి చేశారు. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అన్నట్టుగా పరిస్థితి మారింది. కనీసం వందల సంఖ్యలోనూ అభిమానులు రాకపోవడంతో సాయంత్రం 4గంటలకు ప్రారంభించాల్సిన వేడుకను రాత్రి 8గంటల వరకూ మొదలుపెట్టలేదు.
టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ‘వ్యూహం’ బెడిసికొట్టింది. దీంతో ఎలాగైనా వేడుకకు జనాన్ని తీసుకురావాలని వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆటోలు, కార్లను పెట్టి జనాన్ని తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వారు గంటల కొద్ది వేచి ఉండలేక బయటకు వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు కనిపించకుండా ఉండేందుకు స్టేడియంలో లైట్లు ఆర్పివేసి చీకటిలోనే కార్యక్రమాన్ని మమ అనిపించారు.