Chandra babu reviews : ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో ఖరారు కావడంతో నియోజకవర్గం వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పొత్తులపై సమీక్షలు నిర్వహిస్తూనే.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు. తాజాగా 5 నియోజకవర్గాల అభ్యర్థుల తో సమీక్షను నిర్వహించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయని, నిర్లక్ష్యంగా ఉండొద్దని ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కదలికలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. విభేదాలను పక్కనపెట్టి సమష్టి గా ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నారు ఆయన తాజాగా పాలకొల్లు, అవనిగడ్డ, విజయ వాడ సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట, నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులు, శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
ఆ నియోజకవర్గాల్లో తనకు అందిన సర్వే రిపోర్టు, ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించారు. ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో సూచించారు. పనిచేసే వారికి మాత్రమే తన ప్రోత్సాహం ఉంటుందన్నారు. లేదంటే మరొకరిని వెతుక్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. మేనిఫెస్టో లోని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
మహానాడులో భవిష్యత్ గ్యారెంటీ పేరిట ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోను చంద్రబాబు నియోజకవర్గం వారీగా చర్చిస్తున్నారు. అయితే ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో ప్రతి సీటులో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. పార్టీ ఇన్చార్జి లకే కాకుండా పనిచేసే వారికి సీట్లు ఇస్తామని చెబుతున్నారు. మరి భవిష్యత్తులో మళ్లీ ముఖ్యమంత్రిగా మారేందుకు ఉన్న అవకాశాలను వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇక ఇటు తెలంగాణ, అటు ఏపీ లో ఎన్నికల వేడి మొదలైనట్లే.