Karnataka result : కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండో రౌండ్ ముగిసే సమయానికి కూడా కాంగ్రెస్సే ముందంజలో కొనసాగుతున్నది. మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకుపోతున్నది. మరోవైపు ఢిల్లీలో ని ఏఐసీసీసీ కార్యాలయం వద్ద ఇప్పటికే సంబురాలు మొదలయ్యాయి. పార్టీ గెలుపు ఖాయమని భావిస్తున్నాయి. కర్ణాటకలో కీలక నేత సిద్ధరామయ్య ఇంటి నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మల్యే అభ్యర్థులను బెంగళూరుకు రావాలని అధిష్ఠానం ఆదేశించింది. అయితే ఈ ఆనంద సమయంలో పార్టీ కీలక నేత, సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఎక్కడున్నారనే చర్చ కొనసాగుతున్నది.
కర్ణాటకలో ప్రియాంక విస్తృత ప్రచారం..
కర్ణాటక అసెంబ్లీ (Karnataka result ) ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా శ్రమించారు. పలు ప్రాంతాల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్లారు. అయితే పార్టీ అత్యధిక సీట్లు గెల్చుకుంటున్నదనే ట్రెండింగ్స్ కొనసాగుతున్నాయి,. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎక్కడున్నారనే చర్చ కొనసాగుతున్నది. ఆమె ప్రస్తుతం హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో ఉన్నట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ గెలవాలని అక్కడి హనుమాన్ ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను కాంగ్రెస్ శ్రేణులు విడుదల చేశాయి. ఆమె గుడిలో ఉన్న వీడియోను చూపిస్తూ ఇక గెలుపు తమదేనంటూ చెబుతున్నారు.
అభ్యర్థులపై అధిష్ఠానం నజర్..
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుతం తమ అభ్యర్థులపై దృష్టి పెట్టింది. బీజేపీ ఆపరేషన్ లోటస్ కు తెరదిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భావిస్తున్నది. అందుకే వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని హైకమాండ్ ఆదేశించింది. రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే బీజేపీ జేడీఎస్ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వస్తున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నది. జేడీఎస్ నేతలకు టచ్ లోకి వెళ్తున్నది. ఈ పనిని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే సాయంత్రానికల్లా ఎవరు ఎటు వైపు నిలుస్తారో తేలనుంది.