![CM CBN](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/Chandrababu-4.0.webp)
CM CBN : ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ఇక ఏ శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ అయినా 30నిమిషాల్లో ముగించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా.. అధికారులు పనులను వేగవంతం చేయాలన్నారు.
వైసీపీ పాలనలో ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు చంద్రబాబుకు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు… తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు తెలిపారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల భారీగా అక్రమాలు జరిగాయని వివరించారు. తక్షణం నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారుల మరమ్మతుల పై దృష్టి సారించాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు.. ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే నిత్యావసర సరకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నిత్యావసర సరకుల ధరలపై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష చేశారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 122 రైతుబజార్లు ఉన్నాయని అధికారులు చెప్పగా, నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.