ఏపీలో ఇటీవల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రేపింది. ఏకంగా ఎంపీ భార్య జ్యోతి, కొడుకు శరత్, ఆడిటర్ జీ వెంకటేశ్వరరావును దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. దుండగులను హేమంత్, రాజేష్, సాయిలుగా గుర్తించారు. అయితే వీరిలో రౌడీషీటర్ హేమంత్ ను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. మరి ఏకంగా ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి హేమంత్ సంచలనంగా మారాడు. ఇప్పుడంతా ఆయన మీదే చర్చ నడుస్తున్నది. హేమంత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఎందుకిలా చేశాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకుల కిడ్నాప్ తెలుగు రాష్ర్టాల్లో సంచలనంగా మారింది. ఎంపీ భార్య జ్యోతి, కొడుకు శరత్, ఆడిటర్ జీ వెంకటేశ్వరరావును సినీ ఫక్కిలో దుండగులు అపహరించారు. పోలీస్ శాఖనే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనపై సుమాురు 20 టీంల వరకు రంగంలోకి దించారు. ప్రాథమికంగా ముందుగా డబ్బు కోసం వీరిని అపహరించారని గుర్తించారు. ఎంపీ లేని సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి తొలుత ఆయన కొడుకును కిడ్నాప్ చేసి..ఆపై తల్లిని బెదిరించి నగలు, డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాత ఆడిటర్ దగ్గర డబ్బులు ఉంటాయని తెలిసి..అతడికి ఫోన్ చేయించారు. అతడు వచ్చాక ముగ్గురిని కిడ్నాప్ చేశారు. విషయం బయటకురావడంతో పోలీసులకు రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.
హేమంత్, రాజేశ్, సాయి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.75 కోట్లు కిడ్నాపర్లు దోచుకున్నారని, రూ.86.50 లక్షలను రికవరీ చేసినట్లు తెలిపారు. అయితే హేమంతే ప్రధాన సూత్రధారిగా పోలీసులు చెప్పారు. కానీ ఒక సామాన్య వ్యక్తి ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎలా వచ్చిందన్న ప్రశ్న మొదలైంది. హేమంత్ గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ముందు నుంచీ హేమంత్ది నేర చర్రితే. ఇప్పటికే రౌడీషీట్లు కూడా ఉన్నాయి. హేమంత్ పై 12 కేసులున్నాయి. ఇందులో ఒక హత్య కేసు, 3 అపహరణ కేసులు, 3 గంజాయి కేసులున్నాయి. 2019లో నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోను, ఆ తర్వాత పీఎంపాలెం, భీమిలి పరిధిలోనూ రౌడీషీట్లు ఓపెన్ చేశారు.
హేమంత్ పూర్తి పేరు కోలా వెంకట హేమంత్. పేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి స్కూల్లో ఆయా. హేమంత్కు మరో సోదరుడు ఉన్నాడు. హేమంత్ సీఏ మధ్యలో మానేసినట్లుగా సమాచారం. అయితే హేమంత్ సోదరుడు మాత్రం సాఫ్ట్ వేర్ ఉద్యోగి. జల్సాల కోసం ముందుగా హేమంత్ చోరీలు చేయడం మొదలుపెట్టాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. ఓ మహిళ మెడలోంచి బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లాడు. 2019లో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత విజయా రెడ్డిని ఆమె ఫ్లాటులోనే హత్య చేశాడు. మరో రాజకీయ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను కిడ్నాప్ చేసి.. కోటి డిమాండ్ చేశారు. మరో రియల్డర్ మధును కూడా అపహరించి రూ. 7.50 లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి.. మే 10న విడుదలై.. ఇప్పుడు ఏకంగా ఎంపీ కుటుంబాన్నే టార్గెట్ చేశాడు. అతడితో రాజేశ్ గ్యాంగ్ కలిసింది. అయితే హేమంత్ గతంలోనే సత్యనారాయణతో సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఏదో అంశంలో వీరిద్దరికీ పడకే, హేమంత్ ఇంతకు తెగించాడని అంతా అనుకుంటున్నారు. ఏదేమైనా ఏపీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. రాష్ర్టంలో శాంతిభద్రతలు అసలు లేవని ప్రతిపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చేలా ఈ ఘటన చోలు చేసుకుంది. పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేసేలా జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ReplyForward
|