CM Chandrababu : చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన అనంతరం అయిదు సంతకాలు చేశారు. మెగా డీఎస్పీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు.. స్కిల్ సెన్సస్ పై సైన్ చేశారు. అనంతరం రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లతో భేటీ అయ్యారు. ఏపీలో పని చేస్తోన్న అన్ని శాఖలు, విభాగాల సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అయిదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని అన్నారు. వారు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో అయిదేళ్లల్లో దారుణ పరిస్థితులను చూశానని అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ముద్దాడ రవిచంద్ర, అజయ్ జైన్, సునీల్ కుమార్ లాంటి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మికి కూడా అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ ఆమె అందరితో పాటే చంద్రబాబుకు పూల బొకెను ఇవ్వగా దాన్ని చంద్రబాబు తిరిగి ఇచ్చేశారు. జగన్ అవినీతి ఆరోపణల కేసులో ఉమ్మడి ఏపీలో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు కు అపాయింట్ మెంట్ దక్కలేదు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను భేటీకి అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఐపీఎస్, ఐఏఎస్ లు తీరు మార్చుకుని పని చేయాలని హెచ్చరించారని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని విషయాల్లో పరిశీలన ఉంటుందని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.