![YS Jagan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/29020441719036245.webp)
YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ కార్యాలయాలను కూల్చి వేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చివేయగా జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వాటి పనులు నిలిపివేయాలని నోటీసులు అందాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని.. వారంలో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఎక్కడపడితే అక్కడ ప్యాలెస్ల తరహాలో కార్యాలయాలు నిర్మించారు. వాటిలో కొన్ని పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇవి అన్నీ పూర్తికాక ముందే వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఉక్కుపాదం మోపే పనిలో ప్రభుత్వం పడింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లా (26)లో అన్ని హంగులతో కార్యాలయాలను నిర్మించారు. అయితే ఇవన్నీ ల్యాండ్ లీజింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ టీడీపీ ప్రభుత్వం వరుసగా నోటీసులు జారీ చేసింది.
అమరావతిలో కొనసాగుతున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వారం క్రితం సీఆర్డీఏ అధికారులు వైసీపీకి నోటీసులిచ్చారు. అయితే వాటికి సమాధానం చెప్పకుండా పార్టీ నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో వేకువ జామునే యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేశారు. దీనిపై జగన్ స్పందించారు. ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో సంకేతాలు పంపారని తప్పుపట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయ భవనాలకు నోటీసులు అందజేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనిపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.