Ex Minister Roja : ఏపీలో కూటమి అధిక సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు నిర్వహించి అందులో జరిగిన అవినీతిని టీడీపీ ప్రభుత్వం బయటకు తీస్తుంది. దీంతో టీడీపీ తమపై కక్ష సాధిస్తుందని వైసీపీ గగ్గోలు పెడుతోంది. తాము జైలుకు పంపడం ఖాయమని ఇప్పటికే కొందరు వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని, వారిని జైలుకు పంపడం ఖాయమని కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. భూ కబ్జాలు, ఇసుక తవ్వకాలు, మైనింగ్, మద్యం, డ్రగ్స్, రేషన్ బియ్యం, కాంట్రాక్టులు ఇలా ప్రతీ రంగంలో అవినీతి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు ఆర్జించారని విమర్శలు గుప్పించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి కూడా వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరికలు చేశారు.
అయితే ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు మాజీ మంత్రి ‘రోజా’దిగా వినిపిస్తుంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా సీఎంపై ఈగ వాలనిచ్చేవారు కాదు. అందుకే ఆయన హయాంలో రోజాకు మంత్రి పదవి దక్కింది. జగన్ ప్రభుత్వంలో మొదట ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వెంటనే క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పదవి కొట్టేశారు. ఐదేళ్లు ఆమె ఒక వెలుగు వెలిగారు. జగన్ కేబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ‘ఆడుదాం – ఆంధ్ర, సీఎం కప్’ల పేరుతో జరిగిన కార్యక్రమంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరూ రూ.100 కోట్లు స్కాం చేశారని విమర్శలు వినిపించాయి. ఆత్యా – పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు. స్పోర్ట్ పరికరాలు కొనుగోలు నెపంతో పెద్ద ఎత్తున డబ్బు పక్కదారి పట్టిందని, పైగా నాసిరకం పరికరాలు అందాయని, స్పోర్ట్స్ కోటాలో మెడిసన్, ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీలో సీట్లను కూడా అమ్ముకున్నారని దానిపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. వారు మీడియా మీట్ లో మొత్తుకున్నారు.
దీనికి తోడు రుషికొండపై ప్యాలెస్ అవినీతి కూడా రోజా మెడకే చుట్టుకుంది. రోజా విశాఖకు చెందిన కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. రుషికొండ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్ కూడా రోజాకు భారీ మొత్తంలో ముడుపులు అందజేశారని, ఆ డబ్బుతోనే ఆమె బెంజ్ కారు కొన్నారని విమర్శలున్నాయి.
వీటన్నింటి నేపథ్యంలో రోజా అడ్డంగా బుక్కయ్యారని, నేడో రేపో అరెస్ట్ తప్పదని మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆమె అవినీతి చర్యలకు పాల్పడ్డారని రాతలు రాశారు. నగరి, హైదరాబాద్ తో పాటు విశాఖలో సొంత విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు సంపాదించుకున్నారని విమర్శలు వచ్చాయి.
రోజానే కాదు ఆమె సోదరులు కూడా సోదరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సెటిల్మెంట్లు, దందాలు చేసే వారని స్థానికులు చెబుతున్నారని, మీడియాలోనూ దీనిపై కథనాలు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదని జర్నలిస్ట్ కుండబద్ధలు కొట్టారు. రాబోయే రోజుల్లో సినిమాలు, షోలలో రోజాకు ఛాన్స్ లు రాకపోవచ్చని, ఆమెపై బ్యాన్ విధిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.