AI voice : అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పురుషుడి వాయిస్ తో ఓ మహిళ పొరుగింటి యువతిని మోసం చేసింది. ఆమె నుంచి రూ. 6 లక్షలకు పైగా దోపిడీ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళ ఏఐను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడింది. పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడింది. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలోనే బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. అలా రూ.6 లక్షలకు పైగా కాజేసింది.
వేధింపులు తాళలేని బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఏఐ సాంకేతికతతో ఇదంతా చేసింది పొరుగింటి మహిళ అని తెలిసి అంతా షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం ఆ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే, ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.