CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం వరకు వీలైతే 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో వాలంటీర్లపై స్పందించారు.
వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం 33 మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఈరోజు ఒకే రోజు వారితో పంపిణీ చేయిస్తున్నామన్నారు. అంతేకాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామని అన్నారు. తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్లు స్పష్టం చేశారు.