KCR Campaign in Kodangal : తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. భారాస, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ తాజాగా కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డి నీతి లేని మనిషి అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ గౌరవం దిగజారిపోతుందని కేసీఆర్ అన్నారు.
“నీతి లేని రేవంత్ రెడ్డికి కొడంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలి. నేనే సీఎం అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన సీఎం కావాలంటే ముందు కాంగ్రెస్ గెలవాలి కదా. రూ.50 లక్షలకు ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్ సత్యవంతుడిలా మాట్లాడుతున్నారు. కష్టపడి పని చేసే నరేందర్ రెడ్డిని కాదని, రేవంత్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ గౌరవం తగ్గిపోతుంది. ఎవరుంటే మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాల“ని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల పైకి గతంలో రేవంత్ తుపాకీ పట్టుకుని వెళ్లారని, ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని, వ్యవసాయం చేసే తనకే రైతుల బాధలు తెలుసని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు చాలా మంది భూ కబ్జాదారులని, వారు అధికారంలోకి వస్తే “ధరణి“ని తీసేస్తామంటున్నారని కేసీఆర్ అన్నారు.