Jamili Elections :
కొంతకాలంగా దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతంగా చర్చ కొనసాగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నది. అయితే ఈ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. కానీ ఈ కమిటీలో సౌత్ రాష్ర్టాలకు చోటు కల్పించకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శిస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం ఎప్పుడూ మొండిచేయి చూపడం సర్వసాధారణమైందని మండిపడుతున్నారు.
అయితే జమిలీ ఎన్నికలు దేశానికంతటికీ సంబంధించినవి. ఇలాంటి నిపుణుల కమిటీలో కేంద్రం సౌతిండియా నుంచి చోటు కల్పించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశం మొత్తం అభిప్రాయాలను తీసుకోవాల్సిన సందర్భంలో అలాంటి ప్రయత్నం లేకుండా చేయడం ద్వారా బీజేపీ అభాసుపాలైంది. అయితే దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం వివక్ష కొంత ఎక్కువగానే ఉంది. కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది నుంచి తక్కువ మంది సభ్యులు ఉన్నారు. నిధుల విషయంలోనూ దక్షిణ రాష్ర్టాలపై సవతి ప్రేమ చూపుతుందనే అపవాదును కూడా కేంద్రం మూటగట్టుకుంది.
ఇలాంటి సందర్భంలో కూడా కేంద్రం వ్యవహారశైలి మారడం లేదు. రామనాథ్ కోవింద్ కమిటీలో దక్షిణాది రాష్ర్టాలకు కూడా అవకాశమివ్వాలనే అభిప్రాయం వినిపిస్తున్నది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చ ర్చ జరగాలని, అప్పుడే ఒకే యూనియన్ అనే నినాదానికి సార్థకత దక్కుతుందనే టాక్ వినిపిస్తున్నది. మరి దీనిపై కేంద్రం స్పందన కోసం చాలా పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరి కోవింద్ టీంలో దక్షిణాది కి కూడా అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.