![Deputy CM Pawan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/police-traced-vijayawada-student-kidnapping-case.jpg)
Deputy CM Pawan : మన పోలీసుల సత్తా తక్కువేం లేదు. వాళ్లు మనసు పెట్టాలే కానీ ఎలాంటి కేసు అయినా సరే త్వరగానే ఛేదించగలరు. తాజాగా ఏపీలో అదే రుజువైంది. సరిగ్గా తొమ్మిది నెలల కిందట విజయవాడలో యువతి అదృశ్యమైంది. ఆమెను కనిపెట్టడంలో ఇన్నాళ్లు పోలీసులు నిర్లప్తంగా ఉన్నారు. కానీ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీసులను ఆదేశించారు. జూన్ 22న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక తొమ్మిది నెలలవుతుందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ పవన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పవన్.. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మాచవరం సీఐ గుణరాముకు ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తును వేగవంతం చేసి వెంటనే యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయవాడ నగర సీపీ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాంతో సత్వరం రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఆచూకీని పది రోజుల్లోనే కనిపెట్టారు.
భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లొంగదీసుకున్నాడు. గతేడాది అక్టోబర్ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత వారి వద్ద డబ్బుల్లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. అటు తర్వాత కేరళ, ముంబై, ఢిల్లీ అంతా తిరిగారు. చివరకు జమ్మూకశ్మీర్కు చేరుకున్నారు. డబ్బుల్లేక అక్కడ హోటల్లో అంజాద్ పనికి కుదిరాడు.
వేరే వాళ్లకు ఫోన్ చేస్తుందేమోనని తేజస్వినికి ఫోన్ కూడా ఇచ్చేవాడు కాదని పోలీసులు తెలిపారు. ఓ రోజు అంజాద్ లేని సయంలో అతని ఫోన్ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది. ఆ చిన్న ఆధారంతో పోలీసులు కేసును చేధించారు. పోలీసు బృందాలు జమ్ముకి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నానికి వారిని విమానంలో విజయవాడ తీసుకురానున్నారు. తమ కుమార్తె ఆచూకీ లభించడంతో తేజస్విని పేరెంట్స్ పవన్ కళ్యాణ్ కు, సీపీ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.