BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీదే. ఆస్థానంలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి. ఆయన రాజీనామా వలన ఆ స్థానం ఖాళీ అయింది. ఖాళీ అయిన స్థానం నుంచి పోటీ చేయడానికి పార్టీలోని గులాబీ శ్రేణులు పలువురు ఆశ పడ్డారు. కనీసం సీనియర్ నాయకులకు కూడా అవకాశం ఇవ్వలేదు. పార్టీని నమ్ముకున్నవాళ్లను పక్కకు పెట్టారు. ఉద్యమ నాయకులను పట్టించుకోలేదు. కాషాయం గూటి నుంచి వచ్చి గులాబీ కండువా ఇటీవలనే కప్పుకున్న రాకేష్ రెడ్డి కి టికెట్ ఖరారు చేశారు. ఈ విషయం మూడు జిల్లాల్లోని ఏ ఒక్క సీనియర్ నాయకులతోపాటు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు. మూడు జిల్లాలోని పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోకుండానే రాకేష్ రెడ్డిని ఖరారు చేయడంతో పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా గుప్పుమంది. బొట్టుపెట్టి పిలిచినా ఎమ్మెల్సీ ఎన్నిక సమీక్షా సమావేశానికి నాయకులు, కార్యకర్తలు వచ్చే పరిస్థితి కనబడుతలేదు.
పార్టీ అభ్యర్థిని గెలిపించుకోడానికి మాజీ మంత్రి కేటీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి మూడు జిల్లాలోని ముఖ్య నాయకులైన 130 మందికి పైగా ఇన్విటేషన్ పంపారు పార్టీ పరంగా. కేటీఆర్ వస్తున్నారని తెలిసి కూడా పెద్ద నాయకులు సమావేశానికి డుమ్మా కొట్టారంటే రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వం పై ఎంత అసంతృప్తి ఉందొ చెప్పల్సిన అవసరం లేదు. కనీసం వంద మంది నాయకులైన రావాలి అనుకుంటే నలబై మంది లోపే నాయకులు రావడంతో సమావేశం వెలవెలబోయింది. వచ్చిన వారు సైతం ఇదేమి మీటింగ్ అంటూ ముక్కున వేలేసుకున్నారు. సమావేశానికి వచ్చిన నాయకులు రానివారికి కోసం ఫోన్ చేస్తే కొందరు స్పందించలేదు. మరికొందరు రాకేష్ రెడ్డి వద్దన్నం. పార్టీ వినలేదు. మా మాట వినినప్పుడు మేము ఎందుకు రావాలి అంటూ ముక్కుసూటిగా సమాధానం చెప్పడంతో రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. ఆయనకు పార్టీ అండగా ఉంది. మల్లన్న గతంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. తనదయిన శైలిలో ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత మల్లన్నకు కలిసి వచ్చే విదంగా సన్నాహాలు చేసుకుంటు ప్రచారంలో దూసుకుపోతున్నారు.