CM Revanth Reddy : ఏపీ సీఎం మాటలను ఆయన సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కడపలో శుక్రవారం కడపలో ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీ గురించి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కుట్రలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.
దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో స్పందించారు. ‘‘సొంత చిన్నాన్న హత్య గురించి వాళ్లు చెబుతున్నారు. నా మీద జగన్ చేసిన ఆరోపణలకు విలువ లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు ఓ సూచన.. ముందుగా మీ తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి. నేను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని. నా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం. చంద్రబాబుతో నాకు రాజకీయ సంబంధాలు లేవు. ఏపీలో షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి నా సహకారం ఉంటుంది. ఏపీలో షర్మిలే పెద్ద నాయకురాలు ఆవిడను గెలిపించడానికి రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు’’ అని చెప్పారు.