![KTR vs Revanth Reddy](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/12/revanthreddyktr-1697691025.jpg)
KTR vs Revanth Reddy: హైదరాబాదులో సింగరేణి బొగ్గు గనుల వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. బొగ్గు గనుల వేలంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుల మధ్య ట్వీట్ల యుద్ధం తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి గారూ అంటూ కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తే, కేటీఆర్ గారూ అంటూ రేవంత్ రిప్లై ఇచ్చారు. సింగరేణిలో బొగ్గు గనుల వేలంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలే కాదు.. ట్వీట్ ఫైట్లూ కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, నాలుగు బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ నాటి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలం పాట కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఎంత వరకు సబబన్నారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.
ఇక కేటీఆర్ ట్వీట్ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టూ పాయింట్ ఆయనకు రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి బొగ్గు గనులను తొలిసారి వేలం నిర్వహించిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందని తెలిపారు. అప్పుడే అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టిందన్నారు రేవంత్ రెడ్డి.
అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ను ఆయన ప్రశ్నించారు. సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అప్పుడే వ్యతిరేకించినట్లు తెలిపారు. అరబిందో, అవంతిక కంపెనీలకు అప్పగించిన బొగ్గు గనుల బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క రాసిన లేఖను రేవంత్ రెడ్డి జత చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని స్పష్టం చేశారు. మన బొగ్గు.. మన హక్కును కాపాడి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి.తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితం అంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు.