![Mahesh Babu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/Mahesh-Babu-.jpg)
Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో సినీ పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి వచ్చారు. లేదంటే ఏదో ఒక పార్టీ తరఫున ప్రచారం చేశారు. భారతీయ చిత్రపరిశ్రమలో బాలీవుడ్ నటులకు అభిమానులు ఉంటారు.. కానీ దక్షిణాది నటీనటులకు దక్కే ఆదరాభిమానులు వారికి దక్కవు. ఇక్కడ హీరోలను వారి ఇంటి ఇలవేల్పు మాదిరిగా కొలుస్తుంటారు. అభిమాన తారల కోసం రక్తదానాలు, అన్నదానాలు చేస్తుంటారు. వారికోసం ప్రాణాలు సైతం వదిలేస్తుంటారు. ఈ క్రేజ్ ఆధారంగా ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కొందరు మాత్రం తెరచాటునే ఉండి వారికి మద్ధతు ప్రకటిస్తుంటారు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మరో పార్టీ వాళ్లకు కోపం వస్తుందనో, అనవసరంగా వివాదాల్లోకి వెళ్లడం ఇష్టం లేకనో ఇలా తెర చాటుగానే ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు, దర్శక నిర్మాతలు , ఇతర టెక్నీషియన్లలో ఎవరు ఏ పార్టీ అనేది జనం కచ్చితంగా చెప్పగలరు. కానీ చాలా కొద్ది మందిని మాత్రం అంచనా వేయడం కష్టం.
అలాంటి వారి జాబితాలోకే వస్తుంది సూపర్స్టార్ కృష్ణ కుటుంబం. తొలినాళ్లలో ఆయన ఏ పార్టీతో ఉండకుండా తన పని తాను చేసుకుని పోయేవారు. అప్పట్లో నందమూరి తారక రామారావు తను స్థాపించిన టీడీపీలో చేరాలని ఆహ్వానించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే ఎన్టీఆర్ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న హీరో ఆయనను తన పార్టీలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించింది. ఇదే సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దారుణహత్యతో సూపర్స్టార్ కృష్ణ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని రాజీవ్ గాంధీకి అండగా నిలబడాలని తలంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా సేవలందించడంతో పాటు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపీగా గెలిచారు. ఐదేళ్లు విజయవంతంగా ఎంపీగా వ్యవహరించిన ఆయన 1991 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. తిరిగి 2004 ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ తన నైతిక మద్ధతును ప్రకటించారు. అయితే వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్కు కృష్ణ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పుడు సూపర్స్టార్ కృష్ణ కూడా కన్నుమూయడం, ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం, అల్లుడు గల్లా జయదేవ్ కూడా టీడీపీలో ఉండటంతో కృష్ణ కుటుంబం టీడీపీ వైపే ఉందన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు ఏ పార్టీ వైపు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో రాజకీయాలపై మహేశ్ ఉద్దేశం ఏంటో ఆయన బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. మహేశ్ రాజకీయాలను పరిశీలిస్తాడు కానీ పెద్దగా పట్టించుకోడు. తెలంగాణ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రసంగాలను చూసి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని తనతో చెప్పాడని ఆదిశేషగిరిరావు తెలిపారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అటు రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా మారుతుందన్నారు. తెలంగాణ, కర్ణాటకలు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయని.. రేపు ఏపీ కూడా రావొచ్చునేమోనంటూ ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహేశ్ బాబు గురించి ఆదిశేషగిరి రావు చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మహేశ్ బాబు కాంగ్రెస్ పక్షమేనంటూ ఆ పార్టీ నేతలు, కేడర్ తెగ సంబరపడిపోతున్నారు.