Pathuri Nagabhushanam : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ చంద్రబాబు నాయుడుతో ప్రమాణం చేయించారు. కేసరపల్లి ఐటీ పార్క్లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ మంత్రులతో ప్రమాణం చేయించారు. మొదట జనసేన అధినేత పవన్ కల్యాణ్, అనంతరం నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని.. ఉదయం 10.55 గంటలకు ప్రమాణస్వీకార వేదిక వద్దకు చేరుకుని… ఉదయం 11 గంటల నుంచి 12.30గంటల వరకు వేదికపైనే ఉన్నారు. మధ్యాహ్నం 12.40గంటలకు తిరిగి గన్నవరం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లారు.
ప్రధాని మోడీతో ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్ర ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఐదేళ్ల తర్వాత బాబు సీఎంగా ప్రమాణం చేయడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధుల్లేవు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక ఎన్నో ఉద్వేగభరితమైన దృశ్యాలకు వేదికైంది.