![Mudragada Padmanabham](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/06/Mudragada.jpg)
Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత, వైసీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం ఇటీవల తరచూ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. ఇప్పుడు తన పేరును మార్చుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేశారు ముద్రగడ పద్మనాభం. జనసేన భారీ విజయం సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక ఈ గెజిట్ పత్రాలను పవన్ కళ్యాణ్కు పంపారు ముద్రగడ. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
నేను అసమర్థుడిని.. పవన్ కళ్యాణ్ దమ్మన్న నాయకుడు అంటూ ముద్రగడ భావోద్వేగానికి లోనయ్యారు. తన పేరు మార్చుకోవాలంటూ కాపు, బలిజ యువత నుంచి ఎంతో ఒత్తిడి వచ్చిందని.. మీడియా సమావేశంలో ఎమోషనల్ అయ్యారు. వైసీపీ హయాంలో తాను స్వలాభం కోసమే ఉద్యమం చేశానని జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ పదే పదే ఆరోపించారన్న ముద్రగడ పద్మనాభం.. అమ్ముడుపోయినట్లు ఆరోపించారని గుర్తు చేసుకున్నారు. తాను అసమర్థుడిని, చేతకానివాడిని కాపు రిజర్పేషన్ల ఉద్యమాన్ని కొనసాగించలేకపోయానన్నారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న, ధైర్యమున్న లీడర్ అని ముద్రగడ చెప్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పవన్ కీలకంగా ఉన్నారన్నారు. కాపుల చిరకాల కోరిక తీర్చే అవకాశం ఉన్న దమ్ము, ధైర్యం ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నట్లు చెప్పారు.
కాపుల రిజర్వేషన్లతో పాటుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపైనా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కూడా ఆయన దృష్టి పెట్టాలని ముద్రగడ కోరారు. ఇక సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ తనపై అసభ్య పదజాలంతో బూతులు పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది మంచిపద్ధతి కాదని సూచించారు. అంతకంటే మనుషులను పంపించి మమ్మల్ని చంపేయించండంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తాము అడ్డపడలేమని, అనాథలమని.. బూతులు పోస్టులు పెట్టించడం ఆపివేయాలని వేడుకున్నారు. అలాగే పవన్ పూర్తిగా సినిమాలను మానేయాలని ముద్రగడ కోరారు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత సినిమాలు పూర్తిగా వదిలేశారని. అలాగే పవన్ కూడా సినిమాలు పక్కన పెట్టి ప్రజా సేవపై దృష్టి పెట్టాలని ముద్రగడ సూచించారు.