Rohit Sharma : టీం ఇండియా సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. రోహిత్ ఒక్క సారిగా జూలు విదిల్చడంతో కంగారులు చిత్తయ్యారు. రోహిత్ శర్మ కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. రోహిత్ తో పాటు.. సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబె, హర్దిక్ పాండ్యా ముగ్గురు రాణించడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో కేవలం 181 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ మొత్తం ఎనిమిది సిక్సులు, ఏడు ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టాడు. దీంతో రోహిత్ శర్మ విరాట్ కొహ్లి టీ 20 పరుగుల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ముఖ్యంగా రోహిత్ ఇప్పటి వరకు ఆడిన 157 టీ 20ల్లో 4,165 కొట్టాడు. ఇది వరకు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉండేది. ఈ మ్యాచ్ లో విరాట్ డకౌట్ కావడంతో వెనకబడ్డాడు. 123 టీ 20 ల్లో 4145 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండేవాడు.
కానీ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై దంచి కొట్టి విరాట్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో కొహ్లి రెండో స్థానానికి పడిపోయాడు. అయితే ఈ మ్యాచ్ విజయంతో ఎక్కువ సార్లు టీ 20 మ్యాచులో విజయం సాధించిన కెప్టెన్ లలో పాకిస్థాన్ కెప్టెన్ ముందు వరుసలో ఉండగా.. రోహిత్ ఈ మ్యాచ్ విజయంతో అతడి సరసన చేరాడు.
మరో మ్యాచ్ గెలిస్తే టీ 20 లో ఎక్కువ సార్లు గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కనున్నాడు. దీంతో ఒక్క ఆస్ట్రేలియా మ్యాచ్ లో రోహిత్ రాణించగానే అత్యధిక స్కోర్ల హిరోగా మాత్రమే కాకుండా అత్యధిక మ్యాచులు గెలిపించిన కెప్టెన్ గా కూడా బాబర్ ఆజం సరసన నిలిచాడు.