Simhadri Appanna :
విశాఖ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న పుణ్య క్షేత్రం సింహాచలంలో వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది. దీనిని సింహాద్రి అప్పన్న కొండ అని కూడా అంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకంటారు. దశావతారాలలో ఇది ఒకటని ప్రత్యేకత ఉంది. స్వామివారు నిజరూపంలో ఏడాదికి 12 సార్లు మాత్రమే కనిపిస్తారు. మిగతా రోజులు చందనం పూస్తారు. సముద్రమట్టానికి 240 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈ ఆలయంలో విచిత్ర సంఘటన జరిగింది. ఇదే ఇప్పుడు ఆలయ అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ఆలయ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు హుండీలో ఒక చెక్కు వేశాడు. అది మాములు కాదండోయ్ ఏకంగా రూ. 100 కోట్లు విరాళంగా రాసి వేశాడు. హుండీ సొమ్ము లెక్కింపులో భాగంగా అధికారులు ఈ చెక్కును గుర్తించారు. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో నగదు విరాళంగా అందించిన భక్తుడు ఎవరో అని అత్రుత పడ్డారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు.
అయితే అసలు ట్విస్ట్ అక్కడే వారికి ఎదురైంది. తీరా బ్యాంకులో ఈ చెక్కును డిపాజిట్ చేస్తే, సదరు ఖాతాలో కేవలం రూ. 70 మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇదేందయా ఇది ఇదేం ట్విస్ట్ అనుకోని వెనుదిరిగారు. ఈ చెక్కు వేసిన భక్తుడు ఎందుకు వేశాడు.. ఎవరతను అని వెతికే పనిలో పడ్డారు. అయితే చెక్కును చూశాక ఆలయ అధికారుల హడావుడి చూస్తే వంద కోట్లు అంటే మాములా అన్నట్లు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా అంతా ఉత్తిదే అని తేలడంతో నిరాశతో వెనుదిరిగారు. సింహాద్రి అప్పన్నకే ఆ భక్తుడెవరో గాని ఇలా చేయడం మిగతా భక్తులను విస్మయానికి గురి చేసింది.