![TDP Alliance Victory](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/tdp-janasena-bjp.webp)
TDP Alliance Victory : ఈ మధ్య కాలంలో 95శాతం పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన సంస్థ ‘యాక్సిస్ మై ఇండియా’. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది. ‘ఇండియా టుడే చేసిన సర్వే కూడా ఏపీలో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించిన తర్వాత ఈ సంస్థ ఆదివారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల అంచనాలను కూడా తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో కూటమే గెలుస్తుందన్న ఈ సర్వే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమే గెలుస్తుందని పర్యటించింది. ఎన్డీయే కూటమి 51శాతం ఓట్లతో 98-120 స్థానాల్లో గెలుస్తుందని, వైకాపా 44శాతం ఓట్లతో 55-77 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 2శాతం ఓట్లతో 0-2 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమే గెలుస్తుందని తేల్చాయి.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి వైసీపీ 85 స్థానాలు కోల్పోతుందని.. ఆ స్థానాలు ఎన్డీయే కూటమికి వస్తాయని ‘ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా’ సర్వే అంచనా వేసింది. టీడీపీ 78-96 స్థానాల్లో, జనసేన 16-18 స్థానాల్లో, బీజేపీ 4-6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పథకాలు 22శాతం, ప్రభుత్వ పనితీరు 9శాతం, అభివృద్ధి 18శాతం, పార్టీ అనుకూలత 12శాతం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపాయని తేలింది. ఎన్టీయే కూటమికి పురుషులు 54శాతం, మహిళలు 48శాతం.. వైకాపాకు పురుషులు 41శాతం, మహిళలు 47శాతం మంది మద్దతు పలికినట్లు సర్వే వెల్లడించిందిజ సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చిచూస్తే పురుషుల్లో 10శాతం, మహిళల్లో 2శాతం ఓట్లను వైసీపీ కోల్పోయే ఛాన్స్ ఉందంది.
18-25 ఏళ్ల యువతలో 57శాతం మంది ఎన్డీయేకు మద్దతు పలికారు. వైసీపీకి 39శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. 26-35 ఏళ్లవారిలో 52శాతం ఎన్డీయేకు, 43శాతం వైసీపీకి మద్దతిస్తారు. 36-50 ఏళ్లవారిలో 49శాతం ఎన్డీయేకు, 46శాతం వైసీపీకు ఓట్లేశారు. 61 ఏళ్ల పైబడిన వారిలో వైకాపాకు 49శాతం, ఎన్డీయేకు 46శాతం మద్దతు పలికారని సర్వే వెల్లడించింది. ఓట్లు, సీట్ల అంచనాలతో పాటు రాష్ట్ర ప్రజల మనోగతంపైనా ఈ సర్వే దృష్టిసారించింది. గెలుపోటములను నిర్దేశించే అంశాలను విశ్లేషించింది.