CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు (శనివారం) వరంగల్ లో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించారు. జౌటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్ టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలని సూచించారు.
స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. నాలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇన్ చార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.