![Scotland](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/scotland-celebrations.jpg)
TDP Victory Celebrations in Scotland : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంపై దేశవిదేశాల్లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు ప్రజలు అధికంగా ఉండే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనే కాదు ఆంధ్రులు ఉన్న ప్రతీ చోట విజయోత్సవ సంబరాలు జరుపుకుంటునే ఉన్నారు. టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకోవడంపై ప్రతీ కార్యకర్త తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దీనికి విదేశాల్లో ఉండే ఆంధ్రులు సైతం అతీతులు కాదు. విదేశాల్లో ఉన్న తెలుగు దేశం, చంద్రబాబుపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని ఘనంగా చాటుతున్నారు.
తాజగా స్కాట్లాండ్ రాజధాని ఎడిన్ బర్గ్ నగరంలోని అప్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ లు సకుటుంబ సమేతంగా పాల్గొని తమ ఆకాశమంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఈనాడు అధినేత రామోజీరావు గారి మృతిపై తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రామోజీరావుకు, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించారు. అనంతరం పిల్లలతో కేకు కట్ చేయించి తెలుగు దేశం ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులైన సాంకేతిక నిపుణులు, వైద్యులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఏపీలో గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక, సామాజిక విధ్వంసాన్ని గుర్తుచేసుకున్నారు. 2019కి ముందు శరవేగంగా జరుగుతున్న అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా కాలరాసిందో మరోసారి గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు సీఎం కావడంతో ఏపీ మళ్లీ ప్రగతి పథాన దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పొట్లూరు కృష్ణ, గుత్తా అమర్, దాసరి శ్రీనివాసరావు, వింజం మురళి, పొత్తూరి నవీన్, మండవ అజయ్, డాక్టర్ లావు శ్రీకాంత్, స్కాట్లాండ్ తెలుగు సంఘం ప్రతినిధి కెంబూరి మైథిలి, పొట్లూరి స్రవంతి మరియు జనసేన, బీజేపీ అభిమానులు పాల్గొన్నారు.