CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కరోజు తీరిక లేకుండా ఉన్నారు. శాఖలవారీ సమీక్షలు, అధికారుల బదిలీలు, నియామకాలు, అసెంబ్లీ సమావేశాలు.. ఇలా రోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిచేసే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇదేక్రమంలో కీలక శాఖలకు కొత్త అధికారులను నియమిస్తున్నారు. అలాగే 6 గ్యారెంటీల అమలుపై ప్రత్యేకదృష్టి సారించారు. ఇప్పటికే రెండు అమల్లోకి తేగా, మరో రెండింటిని ఈ నెలాఖరులో ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాగే ప్రజాభవన్ లో వారంలో రెండు సార్లు ప్రజావాణిని నిర్వహిస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం అందించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇంతటి బిజీ షెడ్యూల్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈక్రమంలో 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆయనకు లేఖ రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ ఆ లేఖ రాసింది. ఇందులోనే ఆ అమ్మాయి తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ గా ఓ కోరిక కూడా కోరింది.
లేఖలోని సారంశం..‘‘గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూల్ కు ఉచిత విద్యుత్ అందించాలని మనవి’’ అని కోరుతూ లేఖ రాసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి అమ్మాయి అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ లేక రాసి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతోంది. చిన్నారి అంజలి లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ లేఖ రాసిన అంజలిని తోటి విద్యార్థులు, టీచర్లు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
సాధారణంగా ఎవరైనా పుట్టిన రోజు గిఫ్ట్ గా తనకు సొంతంగా ఏదైనా ఇవ్వాలని కోరుతారు.. కానీ అంజలి తమ గ్రామంలోని స్కూల్ కు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే సామాజిక సేవ అలవడిందని మెచ్చుకుంటున్నారు.