Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల కోసం ‘ప్రజా దర్బార్’ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఉదయం 8 గంటల నుంచి నిర్వహించిన ప్రజా దర్బార్ లో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలి వచ్చారు. వివిధ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి కృషి చేస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.