![AP Assembly Speaker](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/ayyanna-pathrdu.jpg)
AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటన జారీ చేశారు. అనంతరం అయ్యన్నపాత్రుడిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో అయ్యన్న పాత్రుడిని కూర్చొబెట్టారు. ప్రొటెం స్పీకర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం సీఎం చంద్రబాబు స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు కురిపించారు. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్యే వ్యక్తి అయ్యన్న పాత్రుడని కొనియాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచి నిరంతం ప్రజాసేవలో ఉంటున్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న పాత్రుడు తనదైన ముద్రవేశారని చంద్రబాబు కొనియాడారు. విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు.
ఆవిర్భావం నుంచీ టీడీపీలోనే..
చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీలో సీనియర్ నేత. దివంగత ఎన్టీఆర్ కేబినెట్ లోనూ అయ్యన్న మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరగిన ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 24,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు.
అయ్యన్నపాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. 1996లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో అయ్యన్న మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కుతుందని ఆశించారు. యువతకు ప్రాధాన్యమివ్వడంతో మంత్రి పదవి రాలేదు. అయితే ఆయనకు స్పీకర్ పదవి కేటాయించారు. శుక్రవారం నామినేషన్ వేయగా. ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 21న ప్రారంభమయ్యాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించారు. శాసన సభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తొలి రోజు మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. పలు కారణాలతో సభకు రాని ముగ్గురు ఎమ్మెల్యేలు శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గత ప్రభుత్వంలోనూ ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా వ్యవహరించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్నపాత్రుడికే శాసన సభాపతి కుర్చీ దక్కింది.
ఇక డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన పార్టీ నుంచి ఒకరిద్దరు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధా ప్రసాద్ పేరు డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిపై తొందరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.