NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్ ను సైతం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీలో జార్ఖండ్ లోని ఓ జర్నలిస్టుకు సంబంధలున్నాయని సీబీఐ శనివారం అరెస్టు చేసింది. జార్ఖండ్ లోని హజారీబాగ్ కు చెందిన జమాలుద్దీన్ అనే జర్నలిస్టు ఓ హిందీ న్యూస్ పేపర్ లో పనిచేస్తున్నాడు. నీట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కు సాయం చేసినట్లు అభియోగాలు రావడంతో అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది.
అయితే, ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంలను శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు ఈ కేసులో ఈరోజు సీబీఐ బృందాలు గుజరాత్ లో గోద్రా, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్ వంటి వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో జూన్ 27న మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది.