NEET Exam Results : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. ఏపీకి చెందిన చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్ తో ఫస్ట్ ర్యాంకు సాధించారు. NEETకు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది నీట్కు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంక్ సాధించగా, ఎస్సీ కేటగిరిలో ఏపీకి చెందిన యశశ్రీకి రెండో ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన కే రఘురాం రెడ్డికి జాతీయ స్థాయిలో 15 వ ర్యాంక్ వచ్చింది.
ఈసారి అబ్బాయిలే టాప్..
ఈసారి ఫలితాల్లో అబ్బాయిలే టాప్ లో నిలిచారు. తొలి 50 అభ్యర్థుల్లో 40 మంది అబ్బాయిలే ఉండడం గమనార్హం. ఇక అమ్మాయిల్లో పంజాబ్కు చెందిన ప్రంజల్ అగర్వాల్ నాలుగో ర్యాంక్ సాధించగా, అషికా అగర్వాల్ 11 ర్యాంక్ సాధించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశంతో పాటు విదేశాల్లోని 4097 కేంద్రాల్లో మే 7న ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా 20,87,449 మంది పరీక్ష రాయగా, 1145976 మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. అయితే జూన్ 4న ప్రిలిమినరీ కీ ని విడుదల చేసిన ఎన్టీఏ, జూన్ 6 అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిగణనలోనికి తీసుకొని ఫైనల్ అన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేసింది.