South Elections : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే చాన్స్ ఉందో చెబుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది.
దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకేకు 21-22 సీట్లు, కాంగ్రెస్ కు 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఖాతా ఓపెన్ చేయని బీజేపీ ఈసారి మాత్రం 2-6 సీట్లు సాధించే అవకాశం ఉందని వెల్లడించింది.
కేరళ రాష్ట్రంలో బీజేపీ 0-1 ఎంపీ సీటు, కాంగ్రెస్ 8-10, సీపీఎం 6-8, ఐయూఎంఎల్ 1-2, ఇతరులు 1-2 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది. కర్నాటకలో మాత్రం బీజేపీ మంచి సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. బీజేపీ 21-23, కాంగ్రెస్ 4-6, జేడీఎస్ 1-2 సీట్లు సాధించనుందని తెలిపింది.
ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని తేల్చింది. వైసీపీకి 21-22 సీట్లు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3-4 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 8-10, బీజేపీ 4-6, బీఆర్ఎస్ 1-3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని చెప్పింది.
కాగా, సర్వే ఫలితాలపై పలువురు విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో జనం నాడిని ఈ సంస్థ సరిగ్గా అంచనా వేయలేదని అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏం లేదని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రాజధాని నిర్మాణం చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని..ఈ సమస్యలపై ఇప్పటికే జనాలు మండిపడుతున్నారని.. అలాంటప్పుడు వైసీపీకి డబుల్ డిజిట్ కాదు కదా కనీసం ఐదారు సీట్లు గెలిస్తే మహా ఎక్కువ అని అంటున్నారు.