![KTR](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-6-22.jpg)
KTR : తెలంగాణ ఆవిర్భావ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని, దశాబ్దం గడిచిన సందర్భమిది అన్నారు. ఆధునిక భారతం కళ్లారా చూసిన, మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం అని కొనియాడారు. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిదని తెలిపారు. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదని గుర్తు చేశారు. సబ్బండ వర్గాలు కొట్లాడి, పోట్లాడి.. మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిద్దన్నారు. 60 ఏళ్ల విధ్వంస గాయాలను, పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణదని పేర్కొన్నారు. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే, మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిదని తెలిపారు.
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా.. అనితర సాధ్యంగా దశాబ్ద ప్రయాణం సాగిందన్నారు. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు, దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ అని కొనియాడారు. నాడు కరవి, రాళ్లురప్పాలు, కల్లోలిత తెలంగాణ. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ అన అభివర్ణించారు. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని.. తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని.. కాంక్షిస్తూ.. ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరి తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.