Congress : ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. దీంతో మిగతా పార్టీల నేతలు అందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో కాంగ్రెస్ లో చేరితేనే భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. దీనికి బీఆర్ఎస్ కూడా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది.
చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరాలని ఆలోచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్టారెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే బాటలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత, తీగల క్రిష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారతారనే ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ నేతలతో చాలా మంది టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో పనుల కోసం కలిశానని చెబుతున్నా లోపల ఉద్దేశం వేరే ఉంటుందని చెప్పుకుంటున్నారు.