![Prajwal Revanna](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-5-12.jpg)
Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ అరెస్ట్ వారెంట్ శనివారం జారీ చేసింది. ఇప్పటికే పలమార్లు ప్రజ్వల్ కు దర్యాప్తు సంస్థ నోటీసులిచ్చింది. ఆయన విచారణకు హాజరుకాక పోవడంతో తాజాగా అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మహిళల లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. లోక్ సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిశాక, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ ఏప్రిల్ 27న దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు సెట్ అనుమానిస్తోంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. ఆయనను మరింత కట్టడి చేసేందుకు ఆయన బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్.డి. రేవణ్ణ ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు. అంతకుముందు ఆయన ఏడు రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దోషిగా తేలితే ప్రజ్వల్ పై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు.