Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితం చిన్నాభిన్నమై చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. చివరకు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా బెట్టింగ్ కు బానిసై కోట్లు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే రాడ్డుతో కొట్టి హత్య చేశాడు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లికి చెందిన ముఖేష్ కుమార్ (28) బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డాడు. బెట్టింగులు మానుకోవాలని కొడుకుని తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ముఖేష్ మారకపోవడంతో శనివారం రాత్రి తండ్రి సత్యనారాయణ ఇనుపరాడ్డుతో కొడుకుపై దాడిచేసి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన ముఖేష్ కుమార్ అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు ముఖేష్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ముఖేష్ బెట్టింగ్ వ్యసనంతో మేడ్చల్ లోని ఆస్తులు అమ్ముకున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.