![Hyderabad News](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-2-6.jpg)
Hyderabad News : సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కరడుకట్టిన సెల్ ఫోన్ చోరీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 19న అర్ధరాత్రి చోరీలతో భయానక వాతావరణం సృష్టించిన మసూద్ ఉర్ రెహమాన్, ఫజల్ ఉర్ రెహమాన్ ను అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి ద్విచక్ర వాహనం, మారణాయుధాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మసూద్ పై గతంలో నాచారం, మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు మసూద్ విలాసాలకు అలవాటుపడి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే తరహీ కేసుల్లో గతంలో అరెస్టయినట్టు తెలిపారు.
ఈనెల 19న బంధువుల ఇంటికి వచ్చిన మసూద్ స్నేహితుడైన ఫజల్ కి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి చాదర్ఘాట్ వైపు వెళ్లి అక్కడ రోడ్డుపై ఉన్న బైక్ ను చోరీ చేశారు. దానిని మలక్ పేటలోని స్వాగత్ హోటల్ వద్ద పార్క్ చేసి రాత్రి 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లారు. గణేష్ ఆలయం సమీపంలో స్టేషన్ వైపు వెళ్తోన్న ఓ వ్యక్తి వద్ద సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడు. వారి వద్ద ఉన్న కత్తితో బెదిరించి సెల్ ఫోన్ లాక్కెళ్లారు. వెళ్లే క్రమంలో అక్కడున్న వారికి కత్తులు చూపిస్తూ భయానక వాతావరణం సృష్టించారు. అక్కడ బాధితుడు సాయం కోసం కేకలు వేయడంతో రంగంలోకి దిగిన యాంటీ స్నాచింగ్ టీం నిందితులను వెంబడించింది. ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదే క్రమంలో మరో చోరీ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నిందితుడు మసూద్ కాలిలో దిగింది. దీంతో పరారైన నిందితుల కోసం గాలించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి 48 గంటల్లో వారిని పట్టుకున్నారు.