![Hyderabad News](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-6-16.jpg)
Hyderabad News : అధ్వానంగా మారిన రోడ్డును రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తూ వర్షపు నీటితో నిండిన గుంతలో ఓ మహిళ హైదరాబాద్ నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ లో గురువారం నిరసన తెలిపింది. కుంట్లూర్ కు చెందిన గోటేటి నిహారిక ప్రతిరోజూ ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటారు. వారం రోజుల క్రితం చౌరస్తాలోని రోడ్డుపై నున్న గుంతల కారణంగా వాహనంపై నుంచి కిందపడి గాయపడింది. ఇటీవల వర్షాలకు నీరు నిలిచి ఆ గుంతలన్నీపెద్దవిగా మారాయి. దీంతో గురువారం ఆ గుంతల్లో ఆమె బైఠాయించి నిరసన తెలిపారు. తాము పన్నులు చెల్లిస్తున్నామని, మంచి రోడ్లు కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక మహిళలు ఇద్దరు ఆమెకు మద్దతుగా నిలిచారు.
చౌరస్తాలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో మహిళా పోలీసులు ఆమెను పక్కకు తీసుకొచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడికి వచ్చి ఎన్నికలు కోడ్ ముగియగానే పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా నాగోల్ పోలీసులు ఆమె వివరాలను నమోదు చేసుకున్నారు.