![CM Revanth Reddy](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-8-4.jpg)
CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరిలో తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావలసిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయవలసిందిగా కోరారు. ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేశారు.
కాగా మోదీ మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్రెడ్డికి క్యాబినెట్ మంత్రి, బండి సంజయ్ కు సహాయ మంత్రి బెర్తులు దక్కించుకున్నారు. అలాగే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మినిస్ట్రీ దక్కించుకోగా.. పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ మంత్రుల బెర్తులు దక్కాయి.