![RTC MD Sajjanar](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-10-5.jpg)
RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మూర్ లో తన మాల్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాల్ కు సంబంధించిన బకాయిలు రూ.7.50 కోట్లు చెల్లించినప్పటికీ, బకాయిులు ఉన్నట్లు ప్రచారం చేస్తూ పోలీసులను, ఆర్టీసీ అధికారులను మాల్ కు పంపించి బద్ నాం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల వేళ తమ పార్టీని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నుతున్నారని, తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ చెల్లించకుండా సజ్జనార్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.
సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలోనే రూ. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని, దీనిపై సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయని, వాటిని బయటకు తీస్తానని హెచ్చరించారు. డీజిల్, స్క్రాప్, టైర్లు, కొత్త బస్సుల కొనుగోళ్ల పేరిట కమీషన్లు వసూలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.