![Medaram](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-1-12.jpg)
Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. ఆదివారం గద్దెల ప్రాంగణంలో పూజారులు, వాటాదారులు సమావేశమయ్యారు. వరంగల్ లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ మేడారం జాతర కార్యాలయం కోసం వరంగల్ లో స్థలాన్ని కేటాయించారని, నిధులు సమకూరక భద్రకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలు, మేడారం జాతర నిధులు రూ.2 కోట్లు సేకరించి నగర నడిబొడ్డున ఆఫీసు నిర్మించారని గుర్తు చేశారు. ఈ భవనంలోనే అన్ని దేవాదాయ శాఖ కార్యాలయాలు కొనసాగుతున్నప్పటికీ, మేడారం కార్యాలయాన్ని ఖాళీ చేయించి, వేద పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
స్థలం వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, అమ్మవార్లకు కేటాయించిన స్థలంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. దీనిపై మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులకు వినతిపత్రాలిచ్చినా స్పందన లేకపోవడంతో గద్దెలు, ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నా నిర్వహించనున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, పూజారులు ఆదివారం తెలిపారు.