Sankranti Movies : ప్రతీ సంక్రాంతికి టాలీవుడ్ కు ఎదురయ్యే సమస్యే ఈ సారి ఎదురవుతుంది. వరుసగా ఐదు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మేరకు దాదాపుగా డేట్లు కూడా ప్రకటించారు మేకర్స్. అయితే, అన్ని సినిమాలకు థియేటర్లు సరిపోయేలా కనిపించడం లేదు. దీంతో అందులో కొన్ని సినిమాల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ గిల్డ్ కోరుతోంది.
ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హను-మాన్, ఈగల్, సైంధవ్, నాసామి రంగా వంటి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ఐదు సినిమాలు థియేటర్లకు కాస్త ఎక్కువే కావడంతో ఇటీవల ఈ చిత్రాల నిర్మాతలందరూ దిల్ రాజు నేతృత్వంలో సమావేశమై ఘర్షణ పర్యవసానాలను వివరించారు. తేజ సజ్జా ‘హను-మాన్’ విడుదలను వాయిదా వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు గతంలో టాక్ రాగా, జనవరి 12న భారీ నార్త్ ఇండియా రిలీజ్ ను మిస్ కాలేమని మేకర్స్ స్పష్టం చేశారు. హను-మాన్ టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా భారీగా స్పందన వచ్చింది. దీంతో హను-మాన్ పాన్ ఇండియా మూవీ కాబట్టి నార్త్ లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ సౌత్ లో థియేటర్ల కొరత కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో హను-మాన్ టీమ్ సంక్రాంతి రిలీజ్ కే పట్టుబడుతున్నారు. ఒకవేళ హను-మాన్ వెనక్కి వెళ్లలేకపోతే డిస్ట్రిబ్యూటర్లు నాగార్జున నా సామి రంగాపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
నాగార్జున ఫైనల్ కాపీని లాక్ చేయకపోవడం, ఓటీటీ డీల్, ఇతర రైట్స్ కూడా ఫైనలైజ్ కాకపోవడంతో డీల్స్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి కొంత సమయం పట్టొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం సంక్రాంతి సీజన్ చాలా లక్కీగా, తన సినిమాలకు లాభదాయకంగా ఉండడంతో ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసేందుకు విముఖత చూపుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.