![Land Acquisition Act](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/farmers-land-titling-act.jpg)
Land Acquisition Act : కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో ‘భూ సమీకరణ చట్టం’ కూడా ఒకటి. భారీ మెజారిటీతో గెలిచిన చంద్రబాబు నాయుడు భూ సమీకరణ చట్టాన్ని రద్దు చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో కృష్ణా జిల్లాలో కొందరు రైతులు గత వైసీపీ ప్రభుత్వం వేసిన వైఎస్ జగన్ భూ పరిరక్షణ సర్వే గుర్తులను తొలగిస్తున్నారు.
ఎన్నికలకు నెల ముందు వైసీపీ ప్రభుత్వం డిజిటల్ సర్వే ముసుగులో రైతులను సంప్రదించకుండా మండలంలో నాలుగు వేల ఎకరాలను సర్వే చేసి పొలాల్లో గుర్తులు ఏర్పాటు చేసింది. రైతులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఫోటో ఉన్న ఈ గుర్తులను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చర్య గత సరిహద్దులను విస్మరించడం వల్ల రైతుల మధ్య కొత్త ఘర్షణలకు దారి తీసింది. ఉదాహరణకు కుమ్మమూరు గ్రామంలో ఒకే పొలంలో ఒకే చోట మూడు గుర్తులు వేయడం సర్వే ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పకనే చెప్తోంది.
మొదట్లో అధికారులు వేసిన గుర్తులను తొలగించేందుకు రైతులు సాహసించలేదు. అయితే టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యాక భూ కబ్జాలకు సహకరించే చట్టం భూ మీకరణ చట్టంను రద్దు చేస్తూ సంతకం చేయడంతో రైతులకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు అనుకూల ప్రభుత్వం రావడంతో రైతులు సర్వే గుర్తులను తొలగించడం ప్రారంభించారు.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రాకుంటే తాము కోట్లాది రూపాయల విలువైన భూమి, మంచి పంట పండించే భూమిని కోల్పోయేవారిమని రైతులు ఆనంద బాష్పాలు కారుస్తున్నరు. వైఎస్ జగన్ ఐదేళ్ల నియంత పాలన నరకం చూపించిందని, ఇప్పుడు ప్రజా పాలన మొదలైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.