![Cyber Crime](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-2-29.jpg)
Cyber Crime : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇడ్రహీంతో సంబంధాలు పెట్టుకొని మనీ లాండరింగ్ లకు పాల్పడుతున్నారని బెదిరించి ఓ రిటైర్డు ఉద్యోగి దగ్గర నుంచి సైబర్ నేరగాళ్లు రూ.20 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ రిటైర్డు ఉద్యోగి (63)కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నామని, మీ మొబైల్ నంబర్ ను త్వరలో డీయాక్టివేట్ చేస్తున్నామని తెలిపారు.
అనంతరం వాట్సాప్ లో వీడియో కాల్ చేశారు. రాజీకాయ నాయకుడు నవాబ్ మాలిక్ ద్వారా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింక్ పెట్టుకున్నారని, అతని పేరిట హెడీఎఫ్సీ, ఎస్ బీఐ, మరో బ్యాంకులో మూడు ఖాతాలు ఉన్నాయని చెప్పారు. మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారని భయపెట్టారు. తర్వాత బాధితుడికి నకిలీ సీబీఐ లేఖను పంపి, డీసీపీ అధికారిగా నమ్మించారు. కేసుల నుంచి తప్పించాలంటే మీ బ్యాంకులలో ఉన్న డబ్బును పంపించాలని, వాటిని వెరిఫై చేసి తిరిగి బదిలీ చేస్తామని నమ్మించారు. సీబీఐ పేరిట వచ్చిన నోటీసులో బాధితుడి ఆధార్ వివరాలతో సమాచారం ఉండడంతో ఆయన నమ్మాడు. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు.
అనంతరం వారు స్పందించకపోవడం, డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శివమారుతి తెలిపారు.