![Rishabh Pant](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/Rishabh_Pant.webp)
Rishabh Pant : దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతి వేగంతో బైక్ లు, కార్లపై దూసుకెళ్లడమే ఈ ప్రమాదాలకు కారణం. రోడ్డు భద్రతపై అవగాహన లేని సాధారణ వాహనదారులే కాదు సెలబ్రిటీలు కూడా మితిమీరిన వేగం, నిర్లక్షంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినీ నటుడు సాయిధర్మతేజ్, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదాలకు గురై చావు అంచుల దాక వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ బతికి బయటపడతాననుకోలేదంటూ తాజాగా ఎమోషనల్ అయ్యాడు. గతేడాది కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ యేడాది గ్యాప్ తర్వాత ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా ఐపీఎల్ సీజన్ ముగియడంతో జూన్ లో ప్రారంభకాబోయే 2024 టీ 20 వరల్డ్ కప్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్.. తాను ఎదుర్కొన్న స్ట్రగుల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
2022 డిసెంబర్ 30న పంత్కు యాక్సిడెంట్ జరిగింది. దీంతో కాలు లిగమెంట్ చిరిగి పోవడంతోపాటు చేయి, వీపుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. డెహ్రాడూన్లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే యాక్సిడెంట్ కారణంగా గతేడాది క్రికెట్కు దూరమైన తాను ఐపీఎల్ రాణించడంతోపాటు టీ20 ప్రపంచకప్కు ఎంపిక కావడం సంతోషం ఉందన్నాడు. ‘నాకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా చాలా రోజులు బాధపడ్డాను. ఆ యాక్సిడెంట్ నా జీవితంలో చాలా నేర్పింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు భరించలేని నొప్పి కారణంగా బ్రష్ కూడా చేసుకోలేదు. చాలా నరకంగా అనిపించింది. మళ్లీ క్రికెట్ ఆడుతానని అసలే ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన పంత్ మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టి క్రికెట్ ఆడుతాడని అభిమానులు అనుకోలేదు. అయినా పంత్ పట్టుదలతో, తెగువతో..బాధలను పంటి కింద బిగపట్టి తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ బ్యాట్ ను పట్టాలని కష్టపడ్డాడు. అహర్నిషలు శ్రమించి మళ్లీ పూర్వపుస్థాయికి వచ్చాడు. తాజా ఐపీఎల్ లో మంచి ప్రదర్శనే చేశాడు. రాబోయే టీ-20 టోర్నీలో మరింత రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.