![Ganta Srinivasa Rao](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/ganta-rushi.jpg)
Ganta Srinivasa Rao : అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల పేరిట విశాఖకు మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ భవనం నిర్మించారు. సీఎం క్యాంప్ ఆఫీసు కోసం ఈ భవనం నిర్మించగా దీనిపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తులున్నాయి. రుషికొండను బోడిగుండులా కొట్టేసి భవనం నిర్మించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై కోర్టుల్లో కూడా విచారణ జరుగుతోంది. అయితే అనూహ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి జగన్ అధికారం కోల్పోయారు. దీంతో జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే టీడీపీ కార్యకర్తలు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఆ భవనాన్ని పరిశీలించారు. భవనం పరిశీలించిన అనంతరం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
భవనాన్ని సందర్శించి అందులో సదుపాయాలను పరిశీలించి జగన్ తీరుపై మండిపడ్డారు. ఈ భవనంలో బాత్ టబ్ విలువ రూ.26 లక్షలు అని తెలిపారు. గెలిచిన తర్వాత తన వైఎస్ భారతికి బీచ్ వ్యూతో కూడిన ప్యాలెస్ బహుమతిగా ఇస్తానని జగన్ చెప్పినట్లు వివరించారు. ‘రుషికొండ నిర్మాణాల ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే గతంలో అక్రమ కేసులు బనాయించారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చి విలాసవంతంగా కట్టడాలను నిర్మించారు. రుషికొండ నిర్మాణాలపై అన్ని వివాదాలే. పచ్చటి కొండను జగన్ గుండు చేశారు’ అని విమర్శించారు. ‘రిషికొండపై ఎంతో ముచ్చట పడి కట్టుకున్నారు కానీ చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారు. వైసీపీ మునిపోతున్న నావ అని గతంలోనే చెప్పాను. ఇప్పుడు అది మునిగిపోయిన నావ. విశాఖలో రాజధాని వద్దు అని భీమిలి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి జగన్కు బుద్ధి చెప్పారు. మూర్ఖుడు రాజు ఐతే ఇలా ఉంటుందో రాష్ట్రంలో అందరం చూశాం’ అని గంటా శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రుషికొండపై రూ.500 కోట్లతో నిర్మించిన ఈ నిర్మాణాలపై ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానన్నారు.