![BRS KCR](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/KCR-10.jpg)
BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఉద్యమపార్టీగా ఎన్నికల్లో పోటీ చేసి 2014లో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్).. రోజు రోజుకు తన ప్రాభవాన్ని కోల్పోతుంది. అసలు కేసీఆర్ నియంతృత్వ ధోరణే ఎన్నికల్లో ఓటమికి కారణాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి కేసీఆర్ రాజకీయం ప్రాంతీయ వాదం మీద ఉంటుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ వాదంతో ప్రజలను ఏకం చేయగలిగారు. కానీ ఇప్పుడు అది కనుమరుగైంది. రోజు రోజుకు తన ప్రభావం ఆవిరైపోతుంది. బీఆర్ఎస్ కరిగిపోతోంది. ఇప్పుడు రాజకీయాల్లో నిలబడాలంటే మరోసారి ప్రాంతీయ వాదం వ్యూహాన్నే మరోసారి పాటించాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
ఉత్తర, దక్షిణ తెలంగాణల నినాదాన్ని మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఉత్తర తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని బీఆర్ఎస్ సొంత మీడియాలో పేజీలకు పేజీలు కథనాలు రాసి ఒడ్డిస్తున్నారు. రాజకీయంగా కీలక పదవులన్నీ అంటే సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ వంటి కీలక పదవులు, కీలక శాఖలు దక్షిణ తెలంగాణకు చెందిన నేతలకు దక్కాయిని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అదే సమయంలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్తోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు కూడా ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కూడా ఉత్తర తెలంగాణకు పెద్ద పీట వేశారు. ఇప్పుడు మాత్రం అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని ప్రచారం ప్రారంభించి తర్వాత.. కాళేశ్వరం వంటి వాటి ద్వారా ఇతర విషయాల్లోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలా చేయడం ఉత్తర, దక్షిణతెలంగాణల మధ్య కొత్త గొడవ తీసుకు రావడమేనని అది సొంతరాష్ట్రంలో చిచ్చు పెట్టినట్లుగా అవుతుందన్న భావన ఉన్నా.. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికిప్పుడు ఇంతకు మించిన దారి లేదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కంచుకోట. ఇప్పుడు అది పూర్తిగా బీటలు వారిపోయింది. అందుకే సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తప్పవన్న ప్లాన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త రాజకీయాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.