![Madhya Pradesh](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-5.2.jpg)
Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని చంపి, ఆపై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చింద్వారా జిల్లాలోని గిరిజన గ్రామం బోదల్ కచర్ లో జరిగింది. గ్రామానికి చెందిన దినేశ్ సరియం అలియాస్ భురా (26) తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపివేశాడు.
మృతుల్లో అతని తల్లి సియాబాయి (30), భార్య వర్ష (23), అన్న శ్రవణ్ కుమార్ (35), వదిన బారతోబాయి (30), చెల్లి పార్వతి (16), మేనల్లుడు కృష్ణ (5), మేనకోడళ్లు సెవుంటి (4), దీప (1) ఉన్నారు. అనంతరం పక్కింట్లో ఉండే ఓ పదేండ్ల చిన్నారి పైనా దాడికి యత్నించగా ఆ పాప తప్పించుకుంది. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి రాగా దినేశ్ పారిపోయాడు. చుట్టుపక్కల వారు అతడి గురించి వెతుకుతుండగా దగ్గరలోని ఓ చెట్టుకు దినేశ్ ఉరి వేసుకుని కనిపించాడు.
సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 8 మంది చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడు స్కిజోఫ్రెనియా అనే మానసిక రోగి అని, గతంలోనూ ట్రీట్మెంట్ తీసుకున్నారని చింద్వారా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.