INDIA :
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో 26 పార్టీలన్ని కలిసి భారత ఐక్య కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. కానీ బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదని తెలుసుకోవడం లేదు. దీంతో ప్రతిపక్ష కూటమి అభాసుపాలు కావడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోడీ చరిష్మాతో బీజేపీ మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ఇప్పటికే రాజకీయ సర్వేలన్ని రుజువు చేశాయి. కానీ ఏదో మొక్కుబడిగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నాయి.
ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎవరి మాట వినదు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. దీంతో వీరంతా ఏకంగా ఉంటారని అనుకోవడం లేదు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితులు ఒకోలా ఉంటాయి. దీంతో వీరి పొత్తు అనైతికమే అని తెలుస్తోంది. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి చక్కదిద్దుకుంటామని బీరాలు పోతున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్ లో జేఎంఎం, బిహార్ లో జనతాదళ్, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, ఢిల్లీలో ఆప్ పార్టీలు ఇందులో భాగస్వాములే. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన భావజాలం. వీరంతా కలిసి ఉండాలంటే అందరి అభిప్రాయాలు కలవాలి. అది కుదిరేలా కనిపించడం లేదు. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి అనుకూల ఫలితాలు సాధిస్తుందన్న విశ్వాసం ఎవరిలోనూ కనిపించడం లేదు.
ప్రధాని మోడీ తప్ప దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హతలున్న వ్యక్తి కనిపించడం లేదు. మొదట వారి కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటిస్తే దాని మీద కొన్ని అంచనాలు ఏర్పడతాయి. అంగట్లకు పోయి అవ్వ అంటే ఎవరికి పుట్టినవు కొడుకా అన్నట్లు ప్రధాని ఎవరో తెలియదు. కానీ వారు బీజేపీని ఓడించి అధికారం చేజిక్కించుకుంటామని ప్రగల్బాలు పలకడం విడ్డూరంగా ఉంది.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు. వారి సొంత పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించుకునే దమ్ము లేని వారు దేశాన్ని ఏం పాలిస్తారు? ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అనేది బలం లేని కొమ్మ లాంటిది. ఒక్క గాలి వాన వస్తే కూలడం ఖాయం. దేశాన్ని పాలిస్తామని నినాదాన్ని వదిలి ఎవరి పార్టీని వారు బాగు చేసుకోవడం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.