Mukta A2 Cinemas : ప్రేక్షకులు హాయిగా సినిమా చూసే వాతావరణం కల్పించకుండా ఉక్కపోతకు గురిచేసిన ముక్త ఏ2 సినిమాస్ కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 జరిమానా విధించింది. టికెట్ డబ్బులు రిటర్న్ చేయడంతో పాటు ఫిర్యాదిదారుకు పరిహారంగా రూ.3 వేలు, కేసు ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
హైదరాబాద్ ఖైరతాబాద్ ప్రాంతం ఆనంద్ నగర్ కు చెబందిన నేరోళ్ల నిష్పర్ ఫిర్యాదును విచారించిన కమిషన్ ఈ మేరకు తీర్పు చెప్పింది. ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమాను చూసేందుకు నిష్పర్ 2023 ఏప్రిల్ 28న అబిడ్స్ లోని ‘యుక్త ఏ2 సినిమాస్’ థియేటర్ కు వెళ్లారు. అక్కడ తన ద్విచక్ర వాహనం పార్కింగ్ కు రూ.20, సినిమా టికెట్ కు రూ.150 చెల్లించారు. మూవీ ప్రారంభమైనా థియేటర్ లో ఏసీ పనిచేయలేదు. ఉన్న కొన్ని ఫ్యాన్లతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్ సమయంలో థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించినా సరిగా స్పందించలేదు. పైగా అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించడంతో ఫిర్యాదిదారు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.
తెలంగాణ సినిమాస్ (రెగ్యులేషన్) చట్టం-1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. నోటీసులు అందుకున్న థియేటర్ యాజమాన్యం ఫిర్యాదుదారు ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపింది. ఇరువర్గాల వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కమిషన్-2 తీర్పు వెలువరిస్తూ అమలుకు 45 రోజుల గడువు విధించింది.