Pocharam Srinivas : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మరణం తప్పలేదు. కనీసం ఒక్క సీటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. ఇక ఓటు షేర్ శాతం కూడా భారీగా పడిపోయింది. దీంతో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ లోకి వెళ్తుంటే.. మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అటు వైపు వెళ్తే గిట్టుబాటు అవుతుందని ఆలోచిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వీర విధేయుడిగా గుర్తింపు సంపాదించుకున్న మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం (జూన్ 21) ఉదయం బంజారాహిల్స్లోని పోచారం నివాసానికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. స్వయంగా సీఎం ఆహ్వానించడంతో పార్టీ మారేందుకు పోచారం కూడా సిద్ధమయ్యారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కూడా హస్తం పార్టీ గూటికి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పార్టీలో పోచారం శ్రీనివాస్ కు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోచారం లాంటి అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు ప్రభుత్వంలో కొనసాగడం అవసరం అని భావించి రావాలని కోరినట్లు చెప్పారు.
పోచారం మాట్లాడుతూ.. రైతుల కోసం పని చేసే ప్రభుత్వానికే తను మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. రేవంత్ న్యాయకత్వంలో ఎమ్మెల్యేలమంతా మరింత కష్టపడి పని చేస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎంతో సహా మంత్రులు కూడా కష్టపడి పని చేస్తున్నారని కితాబివ్వడం కొసమెరుపు.